విశాఖ కేజీహెచ్‌లో అగ్ని ప్రమాదం

  • కేజీహెచ్ గుండె జబ్బుల విభాగంలో అగ్ని ప్రమాదం
  • ఏసీలో షార్ట్ సర్క్యూట్‌తో దట్టంగా అలుముకున్న పొగలు
  • వార్డులోని 45 మంది రోగులను సురక్షితంగా తరలించిన సిబ్బంది
విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్)లో పెను ప్రమాదం తృటిలో తప్పింది. గుండె జబ్బుల చికిత్సా విభాగంలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో రోగులంతా సురక్షితంగా బయటపడ్డారు.

వివరాల్లోకి వెళితే, గుండె జబ్బుల విభాగానికి చెందిన ఆఫీస్ రూమ్‌లోని ఏసీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వార్డు మొత్తం దట్టమైన పొగలు అలుముకోవడంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పొగ కారణంగా కొందరు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు.

ప్రమాదాన్ని గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. అదే సమయంలో వార్డులో చికిత్స పొందుతున్న 45 మంది రోగులను హుటాహుటిన వేరొక బ్లాక్‌కు సురక్షితంగా తరలించారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ ఈ విషయాన్ని ధృవీకరించారు.

ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఏసీలో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ముప్పు తప్పిందని రోగులు, వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, కేజీహెచ్‌లో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటంపై రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

KGH Fire Accident
King George Hospital
Visakhapatnam
Fire accident
Heart Disease Department
Short Circuit
Hospital Fire Safety
Andhra Pradesh
KGH
Fire Department

More Telugu News